Wednesday, January 28, 2015

సినిమాలలో చందమామ

నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.


విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా... మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి...చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి. 

Thursday, January 22, 2015

స్త్రీల సిలబస్ లో లైంగికవిద్య ఉండేది!

ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును ‘న్యంబుత్సి’ అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లినుంచి కూతురికి వారసత్వంగా అందుతూ ఉంటుంది. అందులో ఒక డోలు(drum), ఒక కొమ్ము(horn), స్త్రీ, పురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీ, పురుషుల కొయ్యబొమ్మలు ఉంటాయి. ఈ పరికరాలు అన్నింటికీ ఎర్రని రంగు పూస్తారు.

Friday, January 16, 2015

అన్నా హజారే కూడా చేరిపోతే పోలా?!

కిరణ్ బేడి నేరుగా బిజెపిలో చేరారనుకోండి...అందులో విశేషం ఏమీలేదు. ఎంతోమంది పోలీస్, సైనికాధికారులు, బురాక్రాట్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. దానికి మనం అలవాటుపడిపోయాం.
అలాగే షాజియా ఇల్మి అనే టీవీ యాంకర్  ఏ కాంగ్రెస్ లోనో, బీఎస్పీలోనో, ఎస్పీలోనో ఉండి బిజెపీకి మారినా-అందులో విశేషం ఏమీ లేదు. దానికి మనం అలవాటుపడిపోయాం. కానీ ఆమె అవినీతివ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన AAPలో చేరి, ఆ తర్వాత తప్పుకుని బిజెపిలో చేరారు.

ఆవిధంగా వీరిప్పుడు బిజెపిలో చేరింది రాజకీయమైన రూట్లోంచి కాదు. రాజకీయేతరమైన 'అవినీతివ్యతిరేక ఉద్యమం' అనే రూట్లోంచి! రాజకీయపార్టీలను అన్నింటినీ-బిజెపితో సహా -కట్ట కట్టి వెక్కిరించి, తిట్టిపోసిన వాళ్ళే ఇప్పుడు అలాంటి పార్టీల రూట్లోకి వచ్చారు. అక్కడుంది విశేషం.

మనం ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా కాసేపు 'అవినీతి వ్యతిరేక ఉద్యమం' అనే పార్టీ కాని పార్టీ తరపున మాట్లాడుదాం. పాపం, అవినీతి వ్యతిరేక ఉద్యమం దీనిని ఎలా ప్రశ్నిస్తుంది? ఇప్పుడు దానికి ఎవరు దిక్కు? వీళ్ళు రేపు పొద్దున రాజకీయాల్లోకి రావడానికి, లేదా రాజకీయాల్లోకి వెళ్లడానికి అవసరమైన ట్రయినింగ్ పొందడానికి తన ప్లాట్ ఫామ్ ను వాడుకున్నారని అనుకోదా? ఏరు దాటి తెప్ప తగలేశారనుకోదా? వీళ్ళను నమ్మి వీళ్ళవెనుక జెండాలు పట్టుకుని ఊరేగినవారు, రామ్ లీలా మైదానంలోనో మరో చోటో పగలు రాత్రి పడిగాపులు పడినవారు ఇప్పుడు ఏమనుకుంటారు? తమను దారుణంగా వెన్నుపోటు పొడిచారని అనుకోరా? అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో వీళ్ళు సాగించిన రాజకీయ రిహార్సల్స్ ను నిజమని నమ్మి చప్పట్లు కొట్టిన జనం ఇప్పుడు ఏమనుకుంటారు?

కిరణ్ బేడి ఇప్పుడు అభివృద్ధి గురించి,  అడ్మినిస్ట్రేషన్ గురించి టీవీ చానెళ్లలో నిమిషాల తరబడి జనానికి ఉద్బోధ చేస్తున్నారు. కానీ ఆమె మొదటినుంచి మాట్లాడుతూ వచ్చింది అవినీతి గురించి, లోక్ పాల్ గురించి కదా? ఇప్పుడు అభివృద్ధికి, అడ్మినిష్ట్రేషన్ కు ఎందుకు ఫిరాయించారు? తను బీజేపీలో చేరగానే అవినీతి మాయమైపోయిందా? లోక్ పాల్ ఇప్పుడో అంశం కాదా? conflict of interest ఆరోపణ ఎదుర్కొంటున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ విషయంలో ఆమె ఇప్పుడు గొంతు ఎత్తగలరా?

అప్పుడలా, ఇప్పుడిలా ఏమిటని అడిగితే, మనం ఎప్పటికప్పుడు evolve అవుతూ ఉంటాం, అభిప్రాయాలు మారుతూ ఉంటాయని ఆమె సెలవిస్తున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారే ఈ 65 ఏళ్ల వృద్ధనేత ఇప్పుడు అభివృద్ధి గురించి సుపరిపాలన గురించి ఉపదేశాలు చేస్తుంటే జనం బుద్ధిగా విని జైకొట్టాలి!

అరవింద్ కేజ్రీవాల్ ను ఈ కోవలోకి చేర్చడానికి వీల్లేదు. ఆయనా రాజకీయాల్లోకి వచ్చాడు కానీ పార్టీ పెట్టి వచ్చాడు. ఏ బిజెపిలోనో, కాంగ్రెస్ లోనో చేరలేదు.

ఇక అన్నా హజారే ఒక్కరే మిగిలినట్టున్నారు. ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే పోలా?


Wednesday, January 14, 2015

స్త్రీ రహస్య ప్రపంచం

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే.  ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి...మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

Thursday, January 8, 2015

స్త్రీని చంపినవాడే వీరుడు!

భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

Saturday, January 3, 2015

హోమర్ ఒడిస్సేకు, నలదమయంతుల కథకు పోలికలు

జోసెఫ్ క్యాంప్ బెల్  తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ,  మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!