Wednesday, April 30, 2014

మత్స్యగంధిపై పరాశరుని కోరిక

తండ్రి దాశరాజు ఆదేశంతో మత్స్యగంధి యమునానదిలో పడవ నడుపుతుండగా, ఒక రోజున...

వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు అనే ముని ఆమెను చూశాడు. అప్పుడతను తీర్థయాత్రకు వెడుతున్నాడు.  అతను మద మాత్సర్యాలు లేని సాధుస్వభావి. అతన్ని ముల్లోకాలూ పొగడుతుంటాయి. అతను గొప్ప బుద్ధి కలిగినవాడు, తపస్సంపన్నుడు. వ్రతనిష్ఠ కలిగినవాడు.

ఏకవస్త్రంతో ఒంటరిగా ఉండి పడవ ఎక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని చూడగానే అతనికి ఆమెపై వాంఛ కలిగింది. తన దివ్యజ్ఞానంతో ఆమె ఎవరో తెలుసుకున్నాడు. పడవ ఎక్కాడు. పడవ ప్రయాణిస్తోంది.  పరాశరుడు మత్స్యగంధినే చూస్తున్నాడు. ఆమెవి ఎంత అందమైన కళ్లో అనుకున్నాడు. ఆమె చనుదోయిని గిల్లాలని అతనికి అనిపిస్తోంది. ఆమె సన్నటి నడుము అతని మనసులో నిలిచిపోయింది. ఆమె కటి ప్రదేశాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆమె మీద తనకు కోరిక కలిగిందని సూచించే మాటలు ప్రారంభించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు.  తన మాటలకు సిగ్గుపడుతున్న ఆ కన్య మీద పడి  సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.


ఎంత శాంతులైనా, ఎంత వాంఛను జయించినవారైనా ఆడది ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ మనస్సు చెదురుతుంది. మన్మధుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరం?!

Wednesday, April 23, 2014

మహాభారతంలో ఒక 'కిరాయి గర్భం' (surrogate mother)కథ

గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస  తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి Surrogate Mother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది.


ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు...ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి...రహస్యం తెలిసిపోవడం లేదా?!

Wednesday, April 16, 2014

మానభంగమూ-మార్నింగ్ గిఫ్టూ

ఇలా స్వామ్యాలు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని షాకింగ్ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో నీ మొహమంత వెడల్పున బంగారంతో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య మానాన్ని హరిస్తారు కనుక అందుకు పరిహారంగా ప్రభాత కానుక (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. స్వామ్యాలు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా.

Thursday, April 10, 2014

మోడీ ప్రధాని అయితే బాధ్యత వహించవలసిన 120 కోట్లమందిలో యశోదా బెన్ ఒక్కరు తగ్గిపోయారు!

నరేంద్ర మోడీకి భార్య ఉందనీ, ఆమె పేరు యశోదా బెన్ అనీ రెండు నెలల క్రితమే వార్త వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆమె ఇంటర్వ్యూ కూడా ప్రచురించింది. మోడీ తన నామినేషన్ పత్రంలో ఆమె పేరు పేర్కొనడం వల్ల ఇది మళ్ళీ వార్త అయింది.

ఇందులో ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు...

మోడీ ఇంతకాలం తనకు పెళ్లి అయిన సంగతిని ఎందుకు దాచినట్టు? అది ప్రపంచానికి తెలియవలసినంత ప్రధానమైన విషయం కాదు కనుక దాచి ఉంచారనుకుందాం. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తికి పెళ్లయిందా లేదా అన్నది అప్రధానం అయినప్పుడు నామినేషన్ పత్రంలో marital status ను అడిగే కాలమ్ ను ఎందుకు చేర్చినట్టు? ఆ కాలమ్ ఉన్న తర్వాత కూడా గత ఎన్నికలలో మోడీ దానిని blank గా ఎందుకు ఉంచేసినట్టు? ఉంచారుపో, దానిని నింపమని సదరు అధికారి ఆయనను ఎందుకు అడగనట్టు? ఇప్పుడు మాత్రమే మోడీ భార్య ఉన్న సంగతిని ఎందుకు వెల్లడించినట్టు?

మన దేశంలో నిబంధనల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అదే మామూలు మనిషి అయితే, దానిని blank గా ఎందుకుంచావని అడుగుతారు. మన ఎన్నికల కమిషన్ ఇంత గొప్పదీ అంత గొప్పదీ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత ఎన్నికల ఘట్టంలోనే అదెంత దుర్బలమో తెలిసిపోతోంది. అభ్యర్థులను కట్టడి చేసే గొప్ప అధికారాలు అన్నీ ఈసీకి ఉన్నాయని అనడమే కానీ వాటిని వినియోగించిన సాక్ష్యం కనిపించడంలేదు, ఉత్తుత్తి నోటీసులు ఇవ్వడం తప్ప.

మోడీ పెళ్లి విషయానికి మళ్ళీ వెడదాం...

ఆయన అన్నదమ్ములు అది బాల్య వివాహం అంటున్నారు కానీ, అలా అని చెప్పలేం. అప్పటికి ఆయనకు 18 ఏళ్ళు, ఆమెకు 17 ఏళ్ళు ఉన్నాయి. అది పెళ్లి అంటే ఏమిటో తెలిసే వయసే.

వారిద్దరి మధ్యా ఎలాంటి కలతలూ లేవు. ఒకరికొకరు ఎందుకు దూరమైనట్టు? ఆయన దేశసేవకు ప్రాధాన్యం ఇచ్చి ఇంట్లోంచి వెళ్లిపోయారని ఒక సమాధానం. దేశసేవ కోసం పెళ్లి మానేస్తే అర్థముంది. కానీ తీరా పెళ్లి చేసుకున్న తర్వాత దేశ సేవకు భార్య అడ్డమని భావించడంలో న్యాయమేముంది? గాంధీ పెళ్లి చేసుకున్నాకే దేశసేవలోకి అడుగుపెట్టారు. భార్యను అడ్డమని భావించలేదు. పైగా ఆమెను కూడా దేశసేవలో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆవిధంగా ఆమె జీవితానికి చరితార్థతను కల్పించారు. మరి మోడీ యశోదాబెన్ కు అటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆమెను అనామకంగా ఎందుకు ఉంచేశారు?

భారతీయ సాంప్రదాయంలో అగ్నిసాక్షిగా జరిగే పెళ్ళికి ఉన్న ప్రతిపత్తి తెలిసినదే కదా! పెళ్లి రెండు జీవితాలకు ముడి. పెళ్లి భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ఒక బాధ్యత. మోడీ ఆ బాధ్యతను ఎందుకు గుర్తించలేదు? ఇన్నేళ్లలోనూ భార్య ఉనికిని ఎందుకు పట్టించుకోలేదు? ఆమె గురించిన సమాచారం కూడా ఆయన వద్ద లేకపోవడమేమిటి? పోనీ తను దేశసేవలో ఉండడం అందుకు కారణం అనుకున్నా, తమ ఇంట్లో ఆమెకు కోడలి స్థానం కదా. ఆమె తన ఇంట్లో సభ్యురాలు కదా. తమ మధ్య భార్యాభర్తల సంబంధం లేకపోయినా వారు విడాకులైతే పుచ్చుకోలేదు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.  వారి మధ్య గొడవలూ లేవు. అలాంటప్పుడు అత్తమామలకు కోడలిగా,  అన్నకు మరదలిగా, తమ్ముళ్ళకు వదినెగా ఆమె స్థానం ఆమెదే కదా. ఆ సంబంధం కూడా ఎందుకు లేకుండా పోయింది?

మొత్తానికి నరేంద్ర మోడీ తన భార్య పట్ల ఎలాంటి బాధ్యతా తీసుకోలేదు. తను దేశసేవ పేరుతో ఆమెను వదలి వెళ్ళేటప్పుడు తానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోలేదని వార్త సూచిస్తోంది. ఆమెను చదువుకోమని చెప్పారు కానీ, ఆ తర్వాత ఆమె ఏం చదువుతోందో, ఏం చేస్తోందో కనుక్కోలేదు. ఆమెకు కూడా ఒక స్త్రీగా భర్తతో కాపురం చేయాలనీ, పిల్లల్ని కనాలనే కోర్కె ఉంటుందన్న సంగతిని ఆలోచించలేదు. విడాకులైనా ఇచ్చి ఆమెను పునర్వివాహానికి ప్రోత్సహించలేదు. అసలు ఆమె అంతరంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమెను అలా విడిచిపెట్టేశారు, అంతే!

నరేంద్ర మోడీ రేపు ప్రధాని అయితే దేశంలోని 120 కోట్ల మందికీ న్యాయం చేయగల సమర్థులే అనుకున్నా, ఆయన ప్రధాని కాకముందే అన్ని కోట్లమందిలో యశోదా బెన్ అనే ఒక్కరు తగ్గిపోయారని మీకు అనిపించడం లేదా?! ఇక్కడే నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ప్రపంచంలో ఎన్ని కోట్లమంది ఉన్నా ఒక్క జీవితం విలువ, మిగిలిన కోట్ల జీవితాల విలువతో సమానం. ఎలాగంటే ఒక తల్లికి పదిమంది పిల్లలు ఉంటే, ఒక్క కొడుకు లేదా కూతురు జీవితం విలువ పదిమంది విలువతో సమానం. తొమ్మిదిమంది జీవితానికి ఉమ్మడిగా ఎక్కువ విలువ ఇచ్చి ఒక్కరి జీవితానికి తక్కువ విలువ నివ్వదు. అలాగే ప్రకృతి అనే తల్లి కూడా తనకు ఎన్ని కోట్ల మంది సంతానం ఉన్నా వారందరికీ విడివిడిగానూ, కలిపీ ఒకే విలువ ఇస్తుంది.

ఈవిధంగా భార్యపట్ల మోడీ బాధ్యత చూపకపోవడం కూడా 120 కోట్లమందిపట్ల బాధ్యత చూపకపోవడంతో సమానమే కాదా?!

Wednesday, April 9, 2014

కాబోయే భార్య సైకిల్ తొక్కడం చూసి జబ్బుపడి మరణించిన ఓ చాదస్తుని కథ!

నాకు ఎంతో ఇష్టుడైన రష్యన్ కథారచయిత యాంటన్ చెహోవ్ రాసిన కథ ఒకటుంది...

దాని ఇంగ్లీష్ అనువాదం శీర్షిక, THE MAN WHO LIVED IN A SHELL. ‘గుల్లలో జీవించిన మనిషి అని మనం అనువదించుకోవచ్చు. కొంచెం సంక్షిప్తం చేయాలనుకుంటే గుల్ల మనిషి అన్నా అనచ్చు.

పైకి చాలా సీరియస్ గా చెబుతున్నట్టు అనిపించే ఈ కథ అడుగడుగునా హాస్యాన్ని పండిస్తూ పోతుంది. ఆ హాస్యంలో అంతర్లీనంగా విషాదమూ, బీభత్సమూ ఉన్నాయేమో కూడా. ఇద్దరు మిత్రులు ఉబుసుపోకకు చెప్పుకునే కబుర్లనుంచి ఈ కథ మొదలవుతుంది. ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.


ప్రకృతిరీత్యానే తమలో తాము ముడుచుకుపోయి జీవించేవారు చాలామంది ఉంటారు. నత్త తన గుల్లలో మొహం దాచుకున్నట్టు వీళ్ళు కూడా మొహం దాచుకుంటూ ఉంటారు. మనిషి సామాజిక జీవి కాకముందు గుహల్లో ఏకాంతవాసం చేసిన కాలానికి వీరు తిరోగమించేవారిలా కనిపిస్తారు. నేను నేచురలిస్టును కాదు కనుక, మనుషుల్లో ఇలాంటి జీవులు కూడా ఒక రకమా అన్నది చెప్పలేకపోతున్నాను అంటూ మిత్రుడు కథ ప్రారంభించి, తనకు తెలిసిన అలాంటి ఒక జీవి గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

Wednesday, April 2, 2014

పాండవులు 'కౌరవులు' ఎందుకు కారు?

 ఈ గుర్తింపుల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది.  నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా.  అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో.  ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే.