Wednesday, November 27, 2013

పెద్దమనిషి అయిన మనవరాలి గురించి శల్యుడి భయాలు

ఎస్. ఎల్. భైరప్ప రాసిన పర్వ నవల ఋతుకాల భయాలతో ప్రారంభమవుతుంది. 

మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ , స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.


భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది. 

Friday, November 22, 2013

"నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ భర్తవే"

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది.

 సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు అంది. 

పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు. 

ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.


Wednesday, November 13, 2013

పెళ్లి ఒకరితో...ప్రేమ ఒకరిపై...

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న అతిశయ రూప లావణ్య సుందరి అయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. 

అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు అంది.  

Thursday, November 7, 2013

"నువ్వు కట్టి విడిచిన చీర నేను కట్టుకోవాలా?"

 కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి. గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది.

 దాంతో దేవయాని మండిపడింది. లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతుర్ని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన  బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు అహం దెబ్బతిన్న శర్మిష్ట దేవయానిని నిందించి ఓ నూతిలోకి తోసి వెళ్లిపోయింది. 

కథనంలో కవి ఎన్ని మెళకువలు చూపాడో చూడండి...దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను దేవయాని నిలదీయడంలో కులాహంకారం పడగవిప్పి బుసకొట్టింది.  భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

అలాగే శర్మిష్ట కూడా...

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒక చోట సమతూకాన్ని స్థాపించితీరుతుంది. 

(పూర్తివ్యాసం http://www.saarangabooks.com/magazine/2013/11/07/%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%80%E0%B0%B0/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)