Monday, July 1, 2013

ముండే కేసు: స్టేట్ ఫండింగ్ ఎలా పరిష్కారం?!

 కిందటి (2009) లోక్ సభ ఎన్నికలలో తను ఎన్నికల కమిషన్ అనుమతించిన 25 లక్షల రూపాయల పరిమితి కంటే చాలా ఎక్కువగా , ఏకంగా 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టానని  ఒక సభలో బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ప్రకటించారు. ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి. మీడియాలో ప్రసారమయ్యాయి. దాంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. తన లాయర్ ద్వారా ఆ నోటీసుకు సమాధానం పంపుతానని ముండే ప్రకటించారు. ఏం సమాధానం ఇస్తారో, ఎన్నికల కమిషన్ దానిపై ఎలా స్పందిస్తుందో చూడవలసిందే.

దీనిపై బీజేపీ అధికారప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ సమాధానం చెబుతూ, ముండే వ్యక్తిగతంగా 25 లక్షల పరిమితిలోనే ఖర్చు పెట్టారని, మిగతా మొత్తాన్ని ఆయన మద్దతుదారులు ఖర్చుపెట్టి ఉండచ్చని ఒక విచిత్ర భాష్యం చెప్పారు. ఆయన వివరణ ప్రకారం వ్యక్తిగతంగా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు పెట్టాలి కానీ, ఆ అభ్యర్థి మీద ఇతరులు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఆ ఖర్చు 8 కోట్లు కావచ్చు, 80 కోట్లు కావచ్చు. తప్పులేదు! అటువంటప్పుడు ఇంత మొత్తమే ఖర్చుపెట్టాలన్న నిబంధన దేనికో?!

నిజానికి అనేక మంది చేసిందీ, చేస్తున్నదే ఆయనా చేశారు. ఎన్నికల్లో ఖర్చు పరిమితి నిబంధన కాగితాలకే పరిమితమని అందరికీ తెలుసు.  కాకపోతే ముండే  ఆ వాస్తవాన్ని బహిరంగంగా  ఒప్పుకున్నారు. అదే తేడా. అయితే,  ఆయన  'నిజం' చెప్పడంలో నిజాయితీ ఉందనుకోవాలో, లేకపోతే ఎన్నికల కమిషన్ ను కాగితం పులిగా పరిగణించి అదేం చేస్తుందిలే అన్న తెగింపు ఉందనుకోవాలో తెలియని పరిస్థితి. పైగా, ఏం చేస్తారో చేసుకోండని సవాలు చేస్తున్నట్టుగా  ఈ లోక్ సభ గడువు ఇంక ఆరునెలలే ఉందని కూడా అన్నారు.

అదలా ఉండగా, అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం ఇటువంటి సమస్యలకు పరిష్కారమనే అభిప్రాయాన్ని ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భమనేముంది, అతి కీలకమైన ఎన్నికల సంస్కరణలలో ఒకటిగా ఆ ప్రతిపాదన చాలాకాలంగా చర్చలో ఉంది. ఇక్కడ సందేహమేమిటంటే, ప్రభుత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే అభ్యర్థి సొంతంగా కోట్లు వెదజల్లడం మానేస్తాడా? అప్పుడు కూడా వోటర్లను ఏదో ఒక రూపంలో ప్రలోభపెట్టడానికి లోపాయికారీగా కోట్లు కుమ్మరించే అవకాశం లేదా? వెనకటికి ఒకావిడ మడి బట్ట తలుపుకి ఆరేసి ఏ దొంగ ఇంట్లోకి వస్తాడో చూస్తానని అందట! అలాగే, ప్రభుత్వం ఖర్చు పెడుతోంది కనుక  దానికి బుద్ధిగా కట్టుబడి అభ్యర్థి సొంతంగా ఖర్చు పెట్టకుండా ఉండిపోతాడా?!

ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని భరించాలన్న ప్రతిపాదన వెనుక  మామూలు బుద్ధికి అందని హేతుబద్ధత ఏదో ఉందనుకుంటే  దయచేసి అదేమిటో  విజ్ఞులు సెలవిస్తారా?

No comments:

Post a Comment