Tuesday, December 4, 2012

చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ: ఏది నిజం? ఎవరు నిజం?

చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్.డీ.ఐ)లను అనుమతించడంపై మీ అభిప్రాయం ఏమిటని ఈమధ్య ఒక మిత్రుడు అడిగారు. నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించాను. అయితే కొన్ని విషయాలలో చటుక్కున అభిప్రాయం చెప్పడం కష్టం. అందులోనూ ఇప్పుడున్న రాజకీయవాతావరణంలో మరింత కష్టం.  ప్రజాస్వామిక రాజకీయాలలో నాయకుడనేవాడు బంగారం లాంటి అంశాన్ని ముట్టుకున్నా అది మట్టైపోతుంది.  రాజకీయపక్షపాతం సోకి అష్టావక్రంగా మారిపోతుంది. అన్నింటికంటే పెద్ద నష్టం ఏమిటంటే, ఆ అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారం జనానికి ఎప్పటికీ అందదు. నిష్పాక్షిక అభిప్రాయం ఎండమావిగా పరిణమిస్తుంది. రాజకీయాల చీకటి బిలంలోకి ఏదైనా ఒక అంశం అంశం  జారిపోయిందా... దానికిక నువ్వులు, నీళ్ళు వదలుకోవలసిందే.

ఇలా అనడంలో ప్రజాస్వామ్యాన్ని, రాజకీయవాదుల్ని తీసి పారేసే ఉద్దేశం అణుమాత్రం కూడా లేదు. ప్రజాస్వామ్యం మంచిదే. రాజకీయవాదులు ఎంతైనా అవసరమే. అయితే, మంచివనుకునే వాటిని కూడా మంచివి కాని లక్షణాలు కొన్ని ఆవహిస్తాయనీ ఒప్పుకోవలసిందే.

దేశ ఆర్థికతకు, భద్రతకు, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని అంశాలనైనా రాజకీయపాక్షికతకు అతీతంగా చూడకూడదా; అన్నీ పార్టీలూ ఏకాభిప్రాయానికి రాకూడదా అనిపిస్తుంది. అయితే ఆ మాట పైకి అనడానికి కూడా సంకోచించవలసిన వాతావరణం ఇప్పుడుంది. ఎందుకంటే అలా అనే వ్యక్తి మీద 'ఐడియలిస్ట్' అన్న ముద్ర పడిపోతుంది. విచిత్రం ఏమిటంటే, 'అవసరాలు' కూడా ఇక్కడ 'ఆదర్శాలు'గా మారిపోతాయి.

నిజానికి ఒకవైపునుంచి చూస్తే ఇరవై ఏళ్లుగా అమలు జరుగుతున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు ఎఫ్.డీ.ఐ కొనసాగింపే తప్ప ఇంకొకటి కాదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరళీకరణ విధానాలు అమలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధానాల ఫలితంగా దేశం 4.50 శాతం 'హిందూ' వృద్ధి రేటునుంచి 8.9 శాతం వృద్ధి రేటును అందుకోవడం చూస్తూనే ఉన్నాం(ఇటీవలి కాలంలో అది తిరోగమన మార్గం పట్టిన సంగతీ గుర్తించవలసిందే). దీనితోపాటు ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయన్న విమర్శా ఉంది. అలాగే, ఈ దేశంలో గత ఇరవై ఏళ్లలో 'అభివృద్ధి' అనే మాట 'అవినీతి'కి పర్యాయపదంగా మారిన సంగతీ నిజం. స్థూలంగా అనిపిస్తున్న దేమిటంటే,  సరళీకరణ ప్రక్రియను మేనేజ్ చేయడంలో రాజకీయనాయకత్వం తగిన పరిణతిని, బాధ్యతాయుత దృష్టిని, జవాబుదారీని  చూపలేకపోయింది. కోతి చేతి కొబ్బరికాయలా వ్యవహరించింది. దాని ఫలితమే రక రకాల స్కాములు!

ఈ ఇరవై ఏళ్లలో రాజకీయనాయకత్వంపై అవిశ్వాసం పెరిగింది. అనుమానాలు పెరిగాయి. వ్యతిరేక భావం పెరిగింది. తేడా గమనించండి...తమ ప్రాంతంలో ఫ్యాక్టరీ కావాలనీ, ప్రాజెక్ట్ కావాలనీ ప్రజలూ, రాజకీయపక్షాలూ ఆందోళన చేసిన రోజులున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అరవై దశకంలో జరిగిన ఆందోళన ఒక ప్రముఖ ఉదాహరణ.  ఎనభై దశకంలో నల్లగొండ జిల్లా ప్రజలు తమ ప్రాంతంలో అణువిద్యుత్ కర్మాగారం రావాలని కోరుకున్న సంగతి గుర్తుచేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కావాలని జనం కోరుకునే వాతావరణం లేదు. పైగా ఆ ప్రయత్నాలను ప్రతిఘటించే వాతావరణం ఉంది. కారణమేమిటి? అభివృద్ధిని మేనేజ్ చేయడంలో రాజకీయనాయకత్వంలో పరిణతి, పారదర్శకత లోపించడం!

ఇటీవలి ఓక్స్ వేగన్ కార్ల ఫ్యాక్టరీ విషయమే తీసుకోండి. ఆ వ్యవహారంలో తలెత్తిన అవినీతి ఆరోపణలే విపక్షాల దృష్టిని, జనం దృష్టిని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. చివరికి ఆ ఫ్యాక్టరీ రాష్ట్రానికి రానే లేదు. చిత్రమేమిటంటే, ఫ్యాక్టరీ రాలేదే నన్న బాధ జనంలోనూ కనిపించలేదు, రాజకీయపక్షాలలోనూ కనిపించలేదు. ఇంకా విచిత్రమేమిటంటే 'అభివృద్ధి' అనే మాటా, అందుకు సంబంధించిన చర్చా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశం మొత్తంలో గత మూడేళ్లుగా వినిపించడమే లేదు. కారణం ఏమిటి? రాజకీయనాయకత్వం!

అభివృద్ధి చర్చను అణగదొక్కుతున్నది అవినీతి ఒక్కటేనా? కాదు...రాజకీయ అవకాశవాదం కూడా.

వామపక్షాల విషయంలో అస్పష్టత లేదు. అవి ఒక సైద్ధాంతిక భూమిక నుంచి సరళీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. అందులో అమెరికాపట్ల వ్యతిరేకత కూడా అంతర్లీనంగా ఉంటుంది. అయితే తాము అధికారంలో ఉన్నచోట సిద్ధాంతాలను సవరించుకోడానికి మొగ్గు చూపిన చరిత్రా వాటికి ఉంది. పశ్చిమ బెంగాల్ లో బుద్ధదేవ్ భట్టాచార్య చేసింది అదే. అలవాటులేని ఔపోసన వల్ల అది అతిగా పరిణమించి వికటించింది. చివరికి వామపక్ష అధికారానికే ఎసరు పెట్టింది,

బీజేపీ వైఖరే ఎక్కువ ప్రశ్నార్థకం. ఆర్థిక సరళీకరణ అనేది కాంగ్రెస్ కు కంటే మితవాద పక్షమైన బీజేపీ హృదయానికే ఎక్కువ దగ్గరగా ఉంటుంది. అయినాసరే, సరళీకరణ చర్యలను అది వామపక్షాలను తలదన్నే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఎందుకు? రాజకీయ అవకాశవాదం మినహా మరో కారణం కనిపించదు.

ఎఫ్.డీ.ఐ దగ్గరికి మళ్ళీ వద్దాం. మంగళవారం నాడు లోక్ సభలో చర్చ ప్రారంభించిన ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ మంచి వాగ్ధాటిని చాటుకుని,  ప్రశంసలు అందుకున్నారు, సరే. అదే సమయంలో కొన్ని అసందర్భ వ్యాఖ్యలూ చేసి చర్చ స్థాయిని దిగజార్చారు. వాల్ మార్ట్ భారత్ లోని అధికారులకు లంచమిచ్చిందన్న ఒక న్యూస్ ఏజెన్సీ వార్తను ఉదహరించి, దానికి నేరుగా మన్మోహన్ సింగ్ ను లింక్ చేశారు. ఆ ప్రస్తావన చేయడం దానికదే తప్పు కాకపోయినా, ఆ సందర్భంలో చేయడంలోనే ఔచిత్యం లోపించింది. చర్చ ఎఫ్.డీ.ఐ మంచి చెడుల గురించే కానీ, అవినీతి గురించి కాదు కదా! అలాగే ఎఫ్.డీ.ఐ అంటే వాల్ మార్ట్ ఒక్కటే కాదు. అయినాసరే ఆమె ఆ వ్యాఖ్య చేయడం దేనిని సూచిస్తుంది? ఎఫ్.డీ.ఐపై కన్నా ప్రభుత్వంపై వ్యతిరేకతనే సూచిస్తుంది. అంతకంటే ముఖ్యంగా విపక్షంగా ప్రభుత్వం చర్యలను వ్యతిరేకించాలి కనుక వ్యతిరేకిస్తున్నామన్న సూచననూ అందించింది.

అదీ అసలు సమస్య.

అదలా ఉంచి ఎఫ్.డీ.ఐపై సుష్మా స్వరాజ్ దండగుచ్చిన అభ్యంతరాలను గమనిస్తే, అవును, నిజమే కదా అనిపిస్తుంది.  దానికి  కపిల్ సిబల్ చెప్పిన సమాధానమూ సహేతుకంగానే కనిపిస్తుంది. రైతులకు నష్టం జరుగుతుందని సుష్మా స్వరాజ్ అంటే లాభం జరుగుతుందని కపిల్ సిబల్ వాదం. ఇందులో ఏది నిజం? జనం ఒక అభిప్రాయానికి ఎలా రావాలి?

రేపు ఒకవేళ  ఎఫ్.డీ.ఐ అమలులోకి వచ్చి ఏళ్ళు గడచినా సరే ఈ రెండు వాదాలూ వినిపిస్తూనే ఉంటాయి. జనం ఒక అభిప్రాయానికి రావడం ఎప్పటికీ జరగకపోయినా ఆశ్చర్యంలేదు. రాజకీయవాదుల నోళ్లలో పడిన ఏ విషయమైనా అంతే.

టెలికాం రంగంపై ప్రభుత్వానికున్న గుత్తాధిపత్యాన్ని సడలించడంపైనా మొదట్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, అందువల్ల పోటీ పెరిగి టెలిఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. బీటీ పత్తి విత్తనాలను బూచిగా చూపించి రైతులను హడలగొట్టారు. వాటి ఖరీదు చాలా ఎక్కువ అన్నారు. కానీ ఇప్పుడు రైతులందరూ బీటీ పత్తి విత్తనాలనే కోరుకుంటున్నారు. వాటి ధర కూడా తగ్గింది. అయినాసరే, బీటీ విత్తనాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తి వాదించే వారు ఇప్పుడూ ఉన్నారు. ఇందులో ఏది నిజం? ఒక అభిప్రాయానికి ఎలా రావాలి?

గతంలో ఎఫ్.డీ.ఐని వ్యతిరేకించిన మన్మోహన్ సింగ్, సోనియాలు ఇప్పుడు ప్లేటు ఎందుకు ఫిరాయించారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. న్యాయమే. కపిల్ సిబల్ సమాధానం చెబుతూ, ఎన్.డీ.ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మురసోలీ మారన్ చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐని అనుమతించడంవల్ల కలిగే లాభాలను ఏకరవు పెట్టిన నోటు చదివి వినిపించారు. ఆ అంశాన్ని బీజేపీ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన సంగతిని కూడా ప్రస్తావించారు. ఇదీ న్యాయమే. రాజకీయపక్షాలే ఎఫ్.డీ.ఐపై అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మాట మారుస్తున్నప్పుడు జనం దానిపై నిశ్చితమైన అభిప్రాయానికి ఎలా రావాలి? అప్పుడు అవసరం లేదనుకున్నామనీ, ఇప్పుడు ఆ అవసరం కనిపిస్తోందని కాంగ్రెస్ అంటుంటే; అప్పట్లో ఆ అవసరం కనిపించించదనీ, ఇప్పుడా అవసరం లేదనీ బీజేపీ అంటోంది.  ఎవరి అంచనా కరక్టనుకోవాలి?

ఎఫ్.డీ.ఐకి మేము వ్యతిరేకం కాదనీ; కావాలంటే రోడ్లు, రేవులు,విద్యుత్తు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎఫ్.డీ.ఐని ఆహ్వానించండని బీజేపీ అంటోంది. అందువల్ల మాత్రం జనంపై ఆర్థికభారం పడదా? రేపు రోడ్ల వినియోగానికి ఎక్కువ టోల్ ను, విద్యుత్ వినియోగానికి ఎక్కువ చార్జీలనూ వసూలు చేయరా?

చివరగా వేసుకోవలసిన అసలు ప్రశ్న...ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన సరళీకరణ ప్రయాణం అంతిమగమ్యానికి చేరనవసరం లేదా, మధ్యలో రైలు దిగిపోగలమా? పోనీ ఈ ఇరవై ఏళ్ల అనుభవాన్ని సమీక్షించుకుని ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగాలో కొత్తగా ప్లాను తయారు చేసుకోవడం అవసరమనిపిస్తే ఆ ప్రయత్నమైనా చేయాలి కదా? ఏదీ ఆ ప్రయత్నం?

పైన చెప్పుకున్నట్టు అయ్యవారిని చేయబోయి కోతిని తయారు చేయడంలో అన్నీ పార్టీలూ సిద్ధహస్తులే అయినప్పుడు, ఎంత మంచి సంస్కరణ అయినా వికటిస్తుంది. అసలు సమస్య ఎఫ్.డీ.ఐ యో మరొకటో కాదు; పరిణతీ, ప్రజాహితదృష్టీ, జవాబుదారీ లోపించిన రాజకీయనాయకత్వమే!













16 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. శ్రీరాంగారు, వెరీ సారీ...నేను సెప్టెంబర్ 30న మీ ప్రశ్నకు జవాబిచ్చాను. అప్పటికి బ్లాగ్ గురించిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంవల్ల నా జవాబు బ్లాగ్ లో కేరీ కాలేదు. కనుక మీకు ఈ-మెయిల్ చేశాను. మీరు చూసి ఉంటారనుకున్నాను. నా మెయిల్ లో సెంట్ ఐటెమ్స్ ను ఓపెన్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకున్నాను. మీకు ఇచ్చిన జవాబు ఉంది. ఇప్పుడు మళ్ళీ నా రచనల జాబితా ఇస్తున్నాను.
      1. లోపలి మనిషి(పి.వి. నరసింహరావు ఇంసైడర్ కు తెలుగు అనువాదం-ఎమెస్కో ప్రచురణ) 2. కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు 3. అవతల(రాజకీయ, సామాజిక వ్యాసాలు) 4. కౌంటర్ వ్యూ(ఆంధ్రప్రభ దినపత్రికలో కాలమ్) 5. కౌంటర్ వ్యూ-2(అచ్చులో) 6. మోహన్ దాస్(గాంధీజీపై రాజ్ మోహన్ గాంధీ రచనకు తెలుగు అనువాదం-ఎమెస్కో ప్రచురణ) 7. గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం(సాహిత్య విమర్శ) 8. మా నాన్న నేను మా అబ్బాయి, మరో అయిదు కథలు(అచ్చులో) 9. మౌనం నా సందేశం(దీర్ఘ కవితా) 10. మహాభారతం: మన మూల చరిత్ర(అచ్చులో)

      Delete
  2. I will check my mail box and get back to you

    ReplyDelete
  3. భాస్కరంగారు

    నాకు మీ నుంచి మైల్ రాలేదండి. ఇప్పటివరకు నేను చిల్లరవాయపారంలో యఫ్.డి.ఐ. మీద చదివిన వ్యాసాలు ఇస్తున్నాను. మీకు ఉపయోగపడుతాయేమో చూడండి.

    Radiating Death: How Walmart Displaces Nearby Small Businesses
    http://www.theatlanticcities.com/jobs-and-economy/2012/09/radiating-death-how-walmart-displaces-nearby-small-businesses/3272/

    సన్నకారు రైతులకు ‘వాల్ మార్ట్’ దెబ్బ
    http://andhrabhoomi.net/content/walmart

    Question mark on govt fruit & vegetable wastage figures
    http://www.business-standard.com/india/news/question-markgovt-fruitvegetable-wastage-figures/488149/

    FDI in retail will not provide any "real" jobs, only an illusion of employment creation.
    http://devinder-sharma.blogspot.in/2012/10/retail-fdi-reloaded-manmohan-singh-says.html

    Food wastage in India is not 40 per cent but 5.8-18 per cent in fruits; 6.8 to 12.4 percent in veggies; and 4.3 to 6.1 per cent in cereals
    http://devinder-sharma.blogspot.in/2012/10/food-wastage-in-india-is-not-40-per.html

    Walmart? Nein, Danke!
    http://www.outlookindia.com/article.aspx?282408

    India's FDI retail saga: From Wal-Mart to Agarwal-Mart?
    http://timesofindia.indiatimes.com/business/international-business/Indias-FDI-retail-saga-From-Wal-Mart-to-Agarwal-Mart/articleshow/16604326.cms

    ReplyDelete
  4. శ్రీ రామ్ గారు...నా మెయిల్ బాక్స్ లో సెంట్ ఐటెమ్స్ లో మీకు మెయిల్ పంపిన సంగతి రికార్డ్ అయింది. ఏవో సాంకేతిక కారణాలవల్ల మీకు అందలేదనుకోవాలి. మీరు వ్యాసాలు సూచించినందుకు ధన్యవాదాలు. నేను కూడా వ్యతిరేక/అనుకూల వ్యాసాలు కొన్ని చదివాను. మీరు సూచించిన దేవీందర్ శర్మ వ్యాసాలు నాకు బాగా పరిచితమే. అయితే చాలామంది ఒక నిర్దిష్ట ప్రాపంచిక దృక్పథం నుంచి, భావజాలం నుంచి ఇలాంటి విషయాల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. వ్యతిరేక వాదాలు ఎంత బలంగా కన్విన్సింగ్ గా ఉంటాయో అనుకూలవాదాలు కూడా అంతే బలంగా అంతే కన్విన్సింగ్ గా ఉంటాయి. కనుక ఏ వాదాన్ని అయినా విశ్వాసంలోకి తీసుకునేముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. పాత అనుభవాలు గుర్తుచేసుకోవాలి. రాజకీయ మతలబులను దృష్టిలో పెట్టుకోవాలి. బీటీ పత్తి విషయాన్ని నేను ప్రస్తావించాను. ఎఫ్.డీ.ఐ మంచిదనో, చెడ్డదనో చటుక్కున తీర్పు చెప్పడం కష్టమని నేను అన్నది అందుకే.

    ReplyDelete
  5. *చాలామంది ఒక నిర్దిష్ట ప్రాపంచిక దృక్పథం నుంచి, భావజాలం నుంచి ఇలాంటి విషయాల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు*

    భాస్కరంగారు,
    నిర్ణయం తీసుకోవటమనేది ఎప్పుడు చాల కష్టమైన పని. కాని ఒక నిర్ణయం తీసుకొనే ముందు అది మనసమాజం పైన,సంస్కృతి పైన ఎటువంటి మార్పులు చూపిస్తాయో అనేది ఊహించటం ,అంచనావేయటం ప్రభుత్వం చేయవలసిన మొదటి పని. నిర్దిష్ట ప్రాపంచిక దృక్పథం, భావజాలం లేకపోతే ఏ కోణంలో నుంచి వాల్ మార్ట్ అనుమతించాలా వద్దా అని నిర్ణయం తీసుకోగలరు? బి జె పి వాళ్ళు కమ్యునిస్ట్ పార్టి వారిలా అమేరికా వ్యతిరేకతతో దీనిని వ్యతిరేకించలేదు.నేను వ్యక్తిగతం గా లిబరల్ పాలసిలను నమ్ముతాను. కాని ఈ విషయంలో మాత్రం బి జె పి పార్టి స్టాండ్ నాదీను. రేపు వాల్ మార్ట్ వచ్చి వ్యాపారం లో క్లిక్ అయితే ఊహించిన పరిణామాలు జరగవచ్చు, ఒకవేళ క్లిక్ కాకపోతే చాలా మంది బి జె పి ని మీరు అప్పుడు ఇలా అన్నారు. దాని ప్రభావం ఎమీలేదు కదా! అని ఎగతాళి చేయవచ్చు కూడాను. కాని నా స్టాండ్ మారదు. కారణం వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టకముందే 125 కోట్లు లంచాలు ఇచ్చారు. అది వారి విలువలు లేని కార్పోరేట్ కల్చర్ ను తెలియజేస్తుంది. పార్లమెంట్ లో ఓటింగ్ సమయంలో మాయ ములాయం లు ఆవిధంగా ప్రవర్తించటానికి ఎంత వత్తిడి వచ్చి ఉంట్టుందో ఊహించవచ్చు. యం బి యస్ ప్రసాద్ లాంటి వారు ఒక వెబ్ సైట్లో వాల్మార్ట్ అనుమతించి, వాళ్ళు చేసే వ్యాపారం మీద నిఘాను వేయాలని , చాలా గట్టిగా నిబంధనలరూపొందించాలని రాశారు. అది చదివి కొద్దిసేపు నవ్వుకొన్నాను.వాళ్ళు అడుగుపెట్టక ముందే పరిస్థితి ఇలా ఉంటే వారిని కంట్రొల్ చేయటానికి నిబందనలతో నాలుగు గోళ్లాలు వేయాలంట.

    మనదేశంలో వ్యాపారస్తుల కోసం, వారికి కనుకూలంగా నిబంధనలు సడలించటం మే రిఫాంస్ అని ప్రజలకు అర్థమౌతున్నాదు. రిఫాంస్ అమలు జరిపే మన ప్రభుత్వం ప్రజల ను దృష్ట్టిలో ఉంచుకొని వారి కొరకు తీసుకొన్న బాధ్యత ఎమిటి? ప్రభుత్వానికి క్రోని కేపిటలిజం ప్రోత్సహించటమే అజెండా గా మారింది. ప్రభుత్వం చట్టం ద్వారా కోర్ట్ కేసులు త్వరగా పరిష్కరించటానికి తీసుకొచ్చిన మార్పులు ఎమైనా ఉన్నాయా? అవి ఈ మధ్య మారుతున్న కాలని కనుగుణంగా చట్టంలో మార్పులు ఎన్ని చేశారు? అని ప్రశ్నించుకొంటే సమాధానలు మనకు తెలుసు.
    రోజు రోజు కి అన్ని రంగాలలో,సమాజంలో పరిస్థితి దిగజారటమే చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో మొదట వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి పూనుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిని పట్టించుకోకుండా మన వ్యవస్థ చాలా పట్టిష్టంగా ఉన్నట్లు, విదేశి పెట్టుబడులకు పూర్తి ద్వారాలు తెరవటం మంచిది కాదు. మనకా పెట్టుబడులు లేకపోతే వచ్చే నష్టం ఎమీలేదు.

    ReplyDelete
  6. "ఒక నిర్ణయం తీసుకునేముందు అది మన సమాజం పైన, సంస్కృతి పైన ఎటువంటి మార్పు చూపిస్తుందో ఊహించడం అంచనా వేయడం ప్రభుత్వం చేయవలసిన మొదటి పని." మన సమాజంపైన, సంస్కృతి పైన ప్రభావాలు పడడం ఎప్పటినుంచీ ప్రారంభమైంది? దానికి ఎంత చరిత్ర ఉంది? ఏదో ఒక్క అంశాన్ని సింగిల్ ఔట్ చేయగలమా? సింగిల్ బ్రాండ్ రిటెయిల్ లో ఎఫ్.డీ.ఐ ని అనుమతిస్తే మీరు చెప్పిన ప్రభావం ఉండదనీ, మల్టీ బ్రాండ్ లో ఉంటుందనీ అనుకోవాలా? బీజేపీ వ్యతిరేకతకు మీరు చెప్పింది కారణమని అనలేం. ఆర్థిక, ఉపాధి కారణాలనే అది చెప్పింది కానీ, సమాజం సంస్కృతి గురించి అనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కి పైగా సంస్కరణ చర్యల్లో ఎన్.డీ.ఏ 16 అమలులోకి తేవడానికి ప్రయత్నించిందని ఆనంద్ శర్మ అన్నారు. "125 కోట్లు లంచాలు ఇచ్చారు. అది విలువలు లేని కార్పొరేట్ కల్చర్ ను తెలియజేస్తుంది." ఇది అవినీతికి సంబంధించిన వేరే కోణం. పాలిసీ చర్చలోకి దానిని తీసుకురాలేం. లంచాలు ఇవ్వడం కేవలం కార్పొరేట్ కల్చరే ననడం వాస్తవికతను ప్రతిబింబించదు. లంచం కార్పొరేట్ల కన్నా చాలా పురాతనమైనది. "ప్రభుత్వానికి క్రోనీ కేపిటలిజం ను ప్రోత్సహించడమే అజెండాగా మారింది" నా అభిప్రాయం కూడా ఇదే. క్రోనీ కేపిటలిజం అన్న మాట వాడలేదు గానీ, ఆర్థిక సరళీకరణ ప్రక్రియను భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వాలు అవిశ్వాసాన్నీ, అనుమానాలనూ మూటగట్టుకుంటున్నాయనే నేనూ రాశాను. "విదేశీ పెట్టుబడులు లేకపోతే వచ్చే నష్టం ఏమీలేదు" వ్యక్తిగతంగా మనకు ఇలాంటి అభిప్రాయాలు ఉండచ్చు. కానీ ఆచరణ విషయంలోకి వెళ్ళేసరికి చాలా మెలికలుంటాయి. మనం మన వస్తువుల ఎగుమతికి విదేశీ విపణుల్ని కోరుకుంటాం. అలాగే విదేశాలు కూడా మన మార్కెట్లలోకి ప్రవేశాన్ని కోరుకుంటాయి. ఇచ్చిపుచ్చుకునే నీతి పాటించక తప్పదు. అందుకే దేనినైనా వ్యతిరేకించే ముందు లేదా అంగీకరించే ముందు చాలా కోణాల నుంచి ఆలోచించాలి. రాజకీయపక్షాల అభిప్రాయాలలో ప్లేయింగ్ టు గేలరీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి.

    ReplyDelete
  7. FDI-retail మీద మీ అభిప్రాయాలు ఆసక్తి కరంగా వున్నాయి.

    సమంగా వున్నంతవరకు, ఇచ్చిపుచ్చుకోవడం న్యాయంగా వుంటుంది. తాము కల్పించలేని మౌలిక సదుపాయాలను, విదేశీవ్యాపారులు కల్పిస్తారని కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వడం బఫూనరీగా అనిపించలేదూ?! ఇక్కడి ప్రజలను వుద్ధరించడానికే వారొస్తున్నట్టు ప్రచారం చేయడం ఏమిటో! 8ఏళ్ళనుండి లేని సంస్కరణలు చివరి రెండేళ్ళలో అదరాబదరా జరిపేయడం చూస్తే, వీళ్ళు చేస్తున్నది ప్రణాళికా బద్ధమైన ఆర్థిక సంస్కరణలా, లేదా దివాళా తీసేముందు చేసే moving sale లాంటిదా అనిపిస్తోంది. 125కోట్లు అమెరికాలో ఖర్చయ్యింది, ఇండియాతో ఆ పని చేయించి పెట్టమని!( మౌలిక సదుపాయాలు, వుద్యోగాలు, రైతు సంరక్షణ కల్గించాలనే తపన అలా లాబీయింగ్ చేయించింది అనుకోవాలేమో..)

    సంస్కరణలు మన్మోహన్ చేస్తున్నాడా? లేదా అమెరికా చేస్తోందా?! 'సంస్కరణ పితామహ' టైటిల్/ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఒబామా/ మన్మోహన్సింగ్/ సోనియా/ చిదంబరం / ములాయం/ మాయావతి లలో ఎవరికి? అనేది దేశప్రజలు తేల్చుకోలేక పోతున్నారన్నది నిజం.

    ReplyDelete
  8. "సమంగా ఉన్నంతవరకు ఇచ్చిపుచ్చుకోవడం న్యాయంగా ఉంటుంది". నిజమే. అప్పుడు చర్చలో సమం/అసమం కోణం ప్రస్ఫుటం కావాలి. కానీ కాలేదు. అలా ఎవరూ డిమాండ్ చేసినట్టు లేదు. మౌలిక సదుపాయాల విషయం...అది బఫూనరీ అయితే, మరి బీజేపీ యే కాక వామపక్షాలు కూడా రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్తు, రేవులు వగైరాలలో ఎఫ్.డీ.ఐని ఆహ్వానిస్తామంటున్నాయి. "సంస్కరణలు ఆదరాబాదరగా జరిపేయడం"... మీరు చూస్తూనే ఉన్నారు, యూపీఏ-2 కుంభకోణాల ఆరోపణల్లో కూరుకుపోయి గత మూడేళ్లుగా ఊపిరాడని స్థితిలో ఉంది. పూర్తిగా డిస్ క్రెడిట్ అయింది. నా బ్లాగ్ లలో ఆ సంగతి ప్రస్తావించాను. ఈ మూదేళ్లలో అన్నీ స్తంభించిపోయిన వాతావరణమే ఉంది. ఈ ప్రభుత్వం పోతుందనుకుందాం. ఎన్.డీ.ఏ యో, అటు సూర్యుడు ఇటు ఉదయించి థర్డ్ ఫ్రంటో అధికారం లోకి వచ్చిందనుకుందాం. అప్పుడు కూడా సంస్కరణలు అమలు/అమలుకాకపోవడం గురించిన చర్చ తలెత్తుతూనే ఉంటుంది. రాజకీయాలనూ, పాలసీ విషయాలనూ వేరు చేసి చూడాలి.

    ReplyDelete
  9. *కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కి పైగా సంస్కరణ చర్యల్లో ఎన్.డీ.ఏ 16 అమలులోకి తేవడానికి ప్రయత్నించిందని ఆనంద్ శర్మ అన్నారు*

    అది పది సం|| క్రితం నాటి మాట. అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎంతో మారింది. ఒకప్పుడు విదేశి మారక ద్రవ్యం లేక విదేశాలకు బంగారం తాకట్టు పెట్టాము. ఆతరువాత పి వి గారి కాలం లో సరళికరణల బాట పట్టాం. సుమారు 15-20సం అవుతున్నాది. మన వ్యూహాలను పున:సమీక్షించుకోవాలి. కేంద్ర మంత్రులు ఆ కోణం లో నుంచి చూడకుండా, రాజకీయకోణంలో నుంచి చూడటం, గతంలో మీపాలనలో 16 సంస్కరణలు అమలుఏయటానికి ప్రయత్నించలేదా? అని మాట్లాడటం విజ్ణత అనిపించుకోదు.



    *మనం మన వస్తువుల ఎగుమతికి విదేశీ విపణుల్ని కోరుకుంటాం*

    ప్రస్తుతం మనదేశం, చైనా రెండు దేశాల అభివృద్దినే తీసుకొంటె (యురోప్ దేశాల అభివృద్ది ఆగిపోయింది, అమేరికా సంగతి తెలిసిందే)చైనా అభివృద్ది అంతా విదేశి ఎగుమతులపైన ఆధారపడి ఉంది.అదే భారతదేశం లో మనం తయారుచేసినవి మనమే వాడుకొంట్టున్నాం. కనుక విదేశి నిధులు లేకపోతే మునిపోయేది ఎమిలేదు. ప్రస్తుతానికి మనదేశానికి విదేశి నిధుల అవసరం పెద్దగా లేదు. కాని ప్రభుత్వ వాదన అవి లేకపోతే పని జరగదన్నట్లు గా మాట్లాడుతున్నాది. డబ్బులు చెట్లకు కాయటంలేదు అని విదేశి పెట్టుబడులు కావాలను కొనేవారు, ముందర చట్టాలను సవరించాలి, ప్రత్యేక కోర్ట్ లను వర్తక, వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఎర్పాటు చేయాలి. అవన్ని ఏర్పాటు చేసి,జాగ్రత్తలు తీసుకొన్న తరువాత గేట్లు తెరిస్తే బాగుంట్టుందేమో! లేకపోతే మనదేశం ఆర్ధికంగా,సామాజికంగా (సంస్కృతి మార్పు వలన )దెబ్బతింట్టుంది. అది ఇప్పటికే మొదలైంది. సామాజిక సంబందాలలో మార్పులు స్పష్ట్తంగా ప్రజలకి కనపడుతున్నాయి. ఆర్ధిక విషయానికి వస్తె కొన్ని ఏళ్ల క్రితం, నాలుగు చిన్నదేశాలకు ఏసియన్ టైగర్స్ అని పేరుపెట్టి వాటిని పైకి (స్టాక్ మర్కేట్లన్ను) తీసుకొనివేళ్లి ఆతరువాత ఆదేశల సంపదను విదేశీ పెట్టుబడుల ద్వారా ఎలా మాయం చేశారో గుర్తుకు తెచ్చుకోండి. మన దేశం లో అలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. నేను రాసిన దానిలో భావం మాత్రమే తీసుకొండి.

    Remove word verification

    ReplyDelete
    Replies
    1. "అది పది సంవత్సరాల క్రితం మాట. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితి ఎంతో మారింది...మన వ్యూహాలను పునఃసమీక్షించుకోవాలి. కేంద్రమంత్రులు ఆ కోణం లోంచి చూడకుండా రాజకీయకోణంలో నుంచి చూడడం విజ్ఞత అనిపించుకోదు" అంటే ఎన్.డీ.ఏ రాజకీయంగా కాకుండా మారిన పరిస్థితుల దృష్ట్యానే సంస్కరణలను వ్యతిరేకిస్తున్నట్టు మీరు నమ్ముతున్నట్టుంది. ఒక పెద్ద రాజకీయ కూటమిగా, తనకంటూ ఒక ఎకనమిక్ థింక్ టాంక్ ఉన్నదిగా విధానపరంగా ఎన్.డీ.ఏ. ఆ అభిప్రాయానికి వచ్చి ఉంటే, తన వాదనను ప్యూర్ ఎకనమిక్స్ కు పరిమితం చేస్తూ ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టి ఎక్కువమందిని ఒప్పించగలిగితే ఒక సందిగ్ధం నుంచి దేశాన్ని తప్పించి మహోపకారం చేసినట్టే. అప్పుడు తప్పకుండా దాని గురించి ఆలోచించవలసిందే. అయితే, రేపు ఎన్.డీ.ఏ అధికారంలోకి వస్తే, 'పదేళ్ళలో పరిస్థితి మారిందన్న'అభిప్రాయానికి కట్టుబడి సంస్కరణలను తిరగదోడుతుందని అంటే వెనకటి అనుభవాల రీత్యా, మన రాజకీయ సంస్కృతి రీత్యా నమ్మడానికి ఈ క్షణాన ఎంతమంది సిద్ధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఆనంద్ శర్మ వ్యాఖ్యకు రెలెవెన్స్ ఇక్కడే. ఈ ప్లేటు ఫిరాయింపు లక్షణం యూపీఏకూ వర్తిస్తుంది. ఇప్పుడు కూడా చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ ని మాత్రమే ఎన్.డీ.ఏ వ్యతిరేకిస్తోంది కానీ మొత్తం సంస్కరణలకు మేము వ్యతిరేకం అనడంలేదు గమనించండి. అవసరమనుకుంటే పునస్సమీక్ష చేయాలని నేనూ అన్నాను. అయితే ఆ పని కేంద్ర మంత్రులు చేయకపోతే ప్రతిపక్షాలు చేయచ్చు. అందులోనూ ప్రధానప్రతిపక్షంగా బీజేపీకి అది మరింత బాధ్యత. ఇంత చర్చలోనూ కనీసం ఆ డిమాండ్ ఏమాత్రమైనా వినిపించిందా? "వ్యక్తిగతంగా లిబరల్ పాలసీలను నేను నమ్ముతాను కానీ (రీటెయిల్ లో ఎఫ్.డీ.ఐ) విషయంలో బీజేపీ స్టాండే నాది కూడా" నని ఇంతకుముందు స్పందనలో మీరు అన్నారు. "భారతదేశంలో మనం తయారు చేసినవి మనమే వాడుకొంటున్నాం. కనుక విదేశీ నిధులు లేకపోతే మునిగిపోయేది ఏమీలేదు" అని పై స్పందనలో అన్నారు. మీరు బీజేపీ స్టాండ్ ను సమర్ధిస్తానని మీరు అనచ్చు కానీ ఎఫ్.డీ.ఐ అవసరంలేదన్న మీ స్టాండ్ ను బీజేపీ కాదు సరికదా సంస్కరణలకు బద్ధ విరోధులైన వామపక్షాలు కూడా సమర్ధించడానికి సిద్ధంగా లేవు. రీటెయిల్ మినహా మిగిలిన వాటిల్లో ఎఫ్.డీ.ఐ కావాలని అవి అంటున్నాయి. అలాగే ఎగుమతుల విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా అవి సమర్ధిస్తాయనుకోను. అలాగని మీ అభిప్రాయాలు తప్పని నేను అనను. ప్యూర్ ఏకనమిక్స్ క్షేత్రంలో నిలబడి ప్రత్యర్థి వాదాలను దీటుగా త్రోసిపుచ్చుతూ మీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చి ప్రభావితం చేస్తే మంచిదే. నేను ప్యూర్ ఎకనమిక్స్ లోకి వెళ్లలేదు. నా బ్లాగ్ లో చర్చించింది పోలిటికో-ఎకనమిక్ కోణం మాత్రమే. ఒకప్పుడు సంస్కరణలను సమర్ధించినవారు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారంటే, యూపీఏ ప్రభుత్వం వాటిని పూర్తిగా మిస్ మేనేజ్ చేయడమే కారణమని నేనూ స్పష్టంగా అన్నాను.

      Delete
    2. నేను ప్యుర్ ఎకనామిక్స్ కోణం లో నుంచి ఈ విషయాన్ని చూస్తున్నాను. బి జె పి,కమ్యునిస్ట్ రాజకీయ పార్టిలు గనుక వాటి పరిధులు వాటికి ఉంటాయి. అందువలన యఫ్.డి.ఐ. లను పూర్తిగా వ్యతిరేకించకపోవచ్చు. మన ప్రభుత్వాలు అవసరం లేక పోయినా విదేశీ బాంకుల నుంచి అప్పులు తీసుకోవటం (కారణాలు వాళ్ళకే తెలియాలి) అనే దానికి అలవాటు పడిపోయారు. అదొక వ్యసనం గా మారింది. దాని గురించి, ఈ క్రింది వీడియో లో అరవింద్ కేజ్రివాల్ చాలా చక్కగా వివరించాడు
      How World-Bank Dictates Indian Policies
      http://www.youtube.com/watch?v=-tqaLMOgPH0

      ప్రభుత్వాల మైండ్ సేట్ అంటే పరోక్షం గా సలహాదారులు మైండ్ సేట్ మార్చటం చాలా సమయం తీసుకొంట్టుంది. అందులోను ఇద్దరు సింగ్ లు మన్మోహన్ సింగ్, మాంటేక్ సింగ్ ఆహ్లువాలియా లు పక్క బ్యురో క్రటిక్ మైండ్ సేట్ ఉన్న వారు. సుమారు 8సం||ల కాలంలో వీరిద్దరు సాదించింది పెద్దగా ఎమీ లేకపోయినా, ప్రభుత్వోద్యుగుల మాదిరిగా ప్రవర్తిస్తూ పదవులు మాత్రం వదలటంలేదు. అమేరికా, ఐరోపా మోడల్స్ అన్ని ఫైల్ అయి ప్రజలు రోజు విధులోకి వచ్చి ఒకవైపు గలటాలు చేస్తూంటే, ఆ ఫైల్యుర్ మోడల్స్ ను ఇండియాకి ఇంపోర్ట్ చేస్తామనటం తప్పించి మన్మోహన్ గారు చేస్తున్న ప్రతిపాదనలు ఎమిటి?
      ఈ రోజు జ్యోతి లో వచ్చిన వార్త. కాలం చెల్లిన విధానాలతో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు: ప్రధాని
      "అయితే వీటిని వ్యతిరేకిస్తున్నవారికి. అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం. లేదా వారు కాల్లం చెల్లిన విధానాలను అవలంబించడమే కారణమంటూ పరోక్షంగా ప్రతిపక్షాలను వి మర్శించారు."
      అభివృద్ది పేరు తో ఇంతకాలం అనుసరించిన వారి ఆర్ధిక మోడల్స్ చివరికి యురోప్ వారిని ఎలా దిగజార్చాయో సింగ్ గారు ముందర తెలుసుకోవాలి. ఇవే ఆర్ధిక మోడల్స్ కు కొత్త పేర్లు (మన దేశ భాషల లో ) పెట్టి, ప్రజలపైన రుద్దితే తెలుసుకోలేనంత అజ్ణానంలో భారతీయులు ఎవరు లేరు.

      Eurozone falls back into recession
      http://www.bbc.co.uk/news/business-20337245


      భారత దేశానికి ప్రస్తుతం, ఈ ఫైల్యుర్ మోడల్స్ ను అనవసరంగా నెత్తిన ఎక్కించుకోవలసిన అవసరం లేదు. నా వాదన ఒక అల్టర్నేటివ్ వాదన కోణం లో చూడండి.

      Remove word verification

      Delete
    3. * కానీ మొత్తం సంస్కరణలకు మేము వ్యతిరేకం అనడంలేదు గమనించండి.*
      మీరు మొత్తం సంస్కరణలు అని అంట్టున్నారు కదా, దాని అర్థం ఎమిటి? ఇవి కొన్ని రంగాలలో సంస్కరణలా? ఐతే ఏ రంగాలు అందులోకి వస్తాయి. చట్టాలలో సంస్కరణలు ఇందులో భాగమా కదా? నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పక చెప్పండి.

      Delete
    4. "బీజేపీ, కమ్యూనిస్టులు రాజకీయ పార్టీలు కనుక వాటి పరిధులు వాటికుంటాయి". ఒప్పుకున్నారు కదా! రాజకీయ అవసరాలు కూడా ఆ పరిధుల్లో భాగమే. నేనా మాట ముందే చెప్పాను. కనీసం ఆర్థికం లాంటి విషయాల్లోనైనా రాజకీయపాక్షికతలకు అతీతంగా ఏకాభిప్రాయానికి వచ్చే రాజకీయసంస్కృతి నెలకొంటే మంచిది కదా అని కూడా అన్నాను. గమనించాల్సింది ఏమిటంటే, తమ తమ రాజకీయ అవసరాల వంటి పరిధుల్లో వ్యవహరించే రాజకీయపక్షాల కలెక్టివ్ విల్ (కాకపోతే మెజారిటీ విల్) పార్లమెంట్ ముఖతా వ్యక్తమై విధాన రూపం ధరిస్తుంది. విధాన రూపకల్పనకు అవసరమైన మేధో వనరులు కూడా మన లాంటి వ్యక్తులకు కంటే రాజకీయపక్షాలకే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. సంస్కరణలు తప్పుదారి పట్టాయనీ, బయటి దేశాల్లో విఫలమైన నమూనాలను మన దేశం మీద గుడ్డిగా రుద్దుతున్నారనీ, అవసరం లేకపోయినా విదేశీ రుణాలు తేవడం వ్యసనంగా మారిందనీ, మనకు విదేశీ నిధులు అవసరం లేదనీ ఎవరికైనా అనిపిస్తే ఆ వాదాన్ని నిరభ్యంతరంగా ముందుకు తేవచ్చు. మీది ప్రత్యామ్నాయవాదంగా గుర్తించడానికి నాకైతే అభ్యంతరం లేదు. అయితే దానికొక స్పష్టతను, సమగ్రతను తేవడానికి ప్రయత్నించండి. అందులో భాగంగా గత ఇరవయ్యేళ్ళ లిబరల్ పాలసీలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాయా, లేక వెనకడుగు పట్టించాయా అన్నది కూడా పరిశీలించాలి. మీరు చెప్పిన ప్రభుత్వ సలహాదారులు తమ తమ రంగాలలో అలా కృషి చేసినవారే. మేధో వేదిక ఏ ఒకరి సొత్తో కాదు.
      ఇన్సూరెన్స్, పెన్షన్ వగైరాలలో సంస్కరణలు; వ్యవసాయ రంగంలో,మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, సహజవనరుల వెలికితీత, వాటి ఆధారంగా పరిశ్రమలు వగైరాలలో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వరంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, ఎస్.ఈ.జెడ్ లు మొదలైనవన్నీ సంస్కరణల కిందికి వస్తాయి. వెనకటి పర్మిట్ కంట్రోల్ రాజ్ ను తొలగించి ఉదారవాద ఆర్థిక విధానాల అమలుకు ఉద్దేశించిన చట్టాలూ ఆ పరిధిలోకే వస్తాయి.
      ఇప్పటికే ఈ అంశం మీద తగినంత చర్చ చేశాం కనుక ఇక విరమిద్దాం.

      Delete
  10. శంకర్,
    అసలికి ప్రపంచలో ఇప్పుడు ఎక్కడైనా గ్లోబలైసేషన్ పేరు వినిపిస్తున్నాదా? ఈ మాట ఒక్క ఇండియాలోనే వినిపించేది. ఆమాట వినిపించి, సంస్కరణల అవాశ్యకతను చెప్పటం మొదలుపెడతారు. సంస్కరణలు అంటే విదేశీ కంపెనీలకు దశాబ్దాలుగా వారు కోరుకున్నపుడల్లా ఎర్రతివాచి పరచి ఆహ్వానించటమా? స్వదేశ వ్యాపారుల విన్నపాలు పట్టించుకోవటం సంస్కరణల క్రింద రాదా?

    టాటా,ఇంఫొసిస్ నారయణముర్తి నుంచి సామాన్య ప్రజల వరకు అవినితిని, జవాబుదారిలేని తనాన్ని భరించలేక ప్రభుత్వాన్ని నిలదీస్తూంటే. ప్రభుత్వం చిల్లర వ్యాపారం లో యఫ్.డి.ఐ. ల మీద చూపిన పట్టుదల, ఉత్సాహంలో వందో వంతు వ్యవస్థలో ప్రజలకు కోరుకొంట్టున్న మార్పులపైన శ్రద్ద పెట్టటంలేదు. టాటా లాంటి మనదేశా పెద్ద పారిశ్రామిక వేత్తలు (వీరిని ఇండియా ఇంక్ అని అంటారు) విదేశాలలో పెట్టుబడులు పెడుతూ, వాళ్ల కార్యలయాలను విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నారని ఆమధ్య వర్తలు వచ్చాయి. ప్రభుత్వలెక్కల ప్రకారం మనదేశానికి విదేశి పెట్టుబడుల రూపంలో వచ్చిన డబ్బులకన్నా, మనదేశ వ్యాపారస్థులు విదేశాలలో పెట్టిన పేట్టుబడులే ఎక్కువ.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు.
      ఆస్ట్రేలియాలా ప్రధాని "స్థానికులను దెబ్బతీసే చీప్ చైనా సరకుల డంపింగ్‌ను అడ్డుకుంటాము, ఏకపక్షంగా స్ఠానికులను దెబ్బతీసే ఫ్రీట్రేడ్, ఫెయిర్ ట్రేడ్ కాదు" అని నిన్నటి వార్త. ఫ్రీట్రేడ్, గ్లోబలైజేషన్ కింద కెనడా ఆయిల్ కంపెనీలను కబళిస్తున్న చైనా మీద నిరసనలు వ్యక్తం అయ్యాయి. BPOలు, చీప్ గూడ్స్ లపై ఇండియా చైనాలకు వ్యతిరేకంగా ఓబామా స్పీచీలు దంచేశారు. తనదాకా వస్తే కాని తత్వం బోధ పడదు మరి! ఇంతా జరుగుతున్నా, 'దున్నపోతు మీద వాన కురిసినట్టూ పట్టించుకోక పోవడం MMSప్రభుతం విశేషం. 8ఏళ్ళలో మూసుకుని వుండి, రెండేళ్లలో బిచాణా ఎత్తివేసే తొందరలో అయినకాడికి 'ఆర్థిక సంస్కరణల' SALE చేసేసి, అందినంత ఆదాయం చేసుకుందామనే తొందర కనిపిస్తోంది తప్ప, ప్రణాలికంగా చేసిన ఆర్థిక సంస్కరణల్లాగా అనిపించడం లేదు.
      ' NDA కూడా 10ఏళ్ళ క్రితం చేసింది అనడం సిగ్గుమాలిన సమర్థన. NDA చేయాలనుకున్నదానికన్నా మేము ఎక్కువ ఎక్కువచేసి తీరుతాము అనడం బుర్రతక్కువ వ్యవహారం. NDA ఎన్నికల్లో ఆ విధానాల వల్ల తుడిచిపెట్టుకు పోయింది, మరి! అలా పోల్చుకోవడమే మూర్ఖత్వం. అంటే ఈ సంస్కరణల క్రెడిట్(వుంటే గింటే) NDAదేనా? 10ఏళ్ళూ వీళ్ళు చేసిన నిర్వాకమేమిటి? CWG, 2G, Adarsh, coalgate, జలయజ్ఞం లాంటి స్కాములేనా?

      word verification here is STUPID.

      Delete